ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు.
గ్రామ సభలలో కార్యక్రమం ప్రారంభంలో ముఖ్యమంత్రి గారి సందేశాన్ని వినిపించి, అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని చెప్పారు.
రైతు భరోసా లబ్ధిదారుల జాబితా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను సాధ్యమైనంతవరకు గ్రామసభలో చదివి వినిపించాలని ఆదేశించారు.
ట్రెండింగ్ వార్తలు
ఇప్పటివరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, జూన్ 2 నుంచి అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారంగా మూడు రోజులపాటు పాలు, మూడు రోజులపాటు రాగి జావా అందిస్తున్న విషయాన్ని వివరించాలన్నారు. అంతేకాకుండా, ఇంటర్ కళాశాలల విద్యార్థులకు కొత్తగా ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం గురించి కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమాల అమలులో సాంస్కృతిక శాఖ, పౌర సంబంధాల శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు.
గ్రామపంచాయతీలకు విడుదల చేస్తున్న నిధుల వివరాలను గ్రామాల వారీగా సిద్ధం చేసి, గ్రామసభలో ప్రకటించాలని ఆదేశించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలు పురోగతిని చీఫ్ సెక్రటరీ మరియు ప్రణాళికా శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాలు, సేవా రంగాల అభివృద్ధిలో కూడా సమగ్రంగా ముందుకు సాగుతోందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

